ఆ పాత్రకు నేనే పర్ఫెక్ట్‌ : నిత్యామీనన్‌

26 Nov, 2019 09:23 IST|Sakshi

చెన్నై : నేనే పర్ఫెక్ట్‌ అంటోంది నిత్యామీనన్‌. తనకు అనిపించింది మాట్లాడడం ఈమె స్వభావం. ఎవరేమనుకున్నా సరే తనకు రైట్‌ అనిపించుకుంది చేసేస్తుంది. అలా పలు విమర్శలకు గురైతుంది కూడా. అందుకే నిత్యామీనన్‌పై పొగరబోతు అనే ముద్ర ఉంది. అయితే నటిగా మంచి పేరే సంపాదించుకుంది. అలాగని కథానాయకి పాత్రలనే చేస్తానని గిర్ర గీసుకుని కూర్చోదు. తనకు నచ్చితే అది చిన్న పాత్ర అయినా చేసేస్తుంది. తాజాగా చాలా పెద్ద బాధ్యతను తీసుకుంది. అదే దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రకు జీవం పోసే బాధ్యత. జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు, ఒక వెబ్‌ సిరీస్‌ తయారవుతున్న విషయం తెలిసిందే.

దీ క్వీన్‌ పేరుతో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక సినిమాగా తెరకెక్కుతున్న తలైవి చిత్రానికి విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయలలితగా బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, చిన్న టీజర్‌ను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేశారు. జయలలితగా కంగనారనౌత్‌ నప్పలేదనే విమర్శలు వస్తున్నాయి.

కాగా జయలలిత బయోపిక్‌తో తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న మరో చిత్రానికి ది ఐరన్‌ లేడీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేరళా బ్యూటీ నిత్యా మీనన్‌ నటించనుంది. దీని చిత్రీకరణ ప్రారంభం కాకపోయినా, ఫస్ట్‌లుక్‌ పో స్టర్‌ను ఆ మధ్య విడుదల చేశారు. అయితే అందులో జయలలిత ఫొటో నూ మార్పింగ్‌ చేశారనే విమర్శలు వచ్చా యి.

కాగా జయలలిత పాత్రలో నటించనుండడం గురించి నటి నిత్యామీనన్‌ చాలాసార్లు తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. కాగా తలైవి చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైన తరువాత నటి నిత్యామీనన్‌ మరో సారి స్పందించింది. ఒక భేటీలో ఈ అమ్మ డు మాట్లాడుతూ..జయలలితగా నటించడానికి తానే పర్ఫెక్ట్‌ అని చెప్పింది. జయలలిత మాదిరిగానే తాను నచ్చని విషయాల గురించి ముఖం మీదే చెప్పేస్తానని అంది. ఇప్పుడు జయలలిత పాత్రలో నటించనుండడంతో ఆమె గురించి పూర్తిగా తెలుసుకుంటున్నానని అంది. ఆమెలా నటించడానికి తనను తాను తయారు చేసుకుంటున్నానని చెప్పింది. జయలలిత పాత్రకు 100 శాతం శ్రమిస్తానని నిత్యామీనన్‌ అంటోంది.

మరిన్ని వార్తలు