పవర్ స్టార్ కొత్త సినిమా తమిళ్‌ రీమేకా?

1 May, 2016 15:18 IST|Sakshi
పవర్ స్టార్ కొత్త సినిమా తమిళ్‌ రీమేకా?

చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, దర్శకుడు ఎస్‌జే సూర్య కాంబినేషన్‌లో గతవారం ప్రారంభమైన కొత్త సినిమా.. ఓ తమిళ చిత్రానికి రీమేకా అంటే అవుననే వినిపిస్తున్నది. సూపర్‌స్టార్ అజిత్ హీరోగా వచ్చిన తమిళ్ బ్లాక్‌ బస్టర్‌ 'వీరమ్‌' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తున్నది.

'కొన్ని నెలల కిందటే ఈ సినిమా రీమేక్‌ హక్కుల్ని చిత్రబృందం సొంతం చేసుకుంది. తెలుగు నెటివిటీకి అనుగుణంగా ఈ కథను మార్చేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు' అని చిత్రయూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'వీరమ్‌' సినిమా మక్కీమక్కీగా తెలుగులో రీమేక్ చేయబోరని, పవన్ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని.. మూలకథ దెబ్బతినకుండా మార్పులు చేస్తున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'వీరమ్‌'లో అజిత్ పాత్రను పవన్ కల్యాణ్‌ చేయబోతున్నారు.


పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు ఎస్‌జె సూర్య కాంబినేషన్‌లో  వచ్చిన 'ఖుషి' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరిద్దరి కలయికలో తాజా సినిమాకు క్రేజ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. 2001 ఏప్రిల్ 27న 'ఖుషి' విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత, 'ఖుషి' విడుదలైన రోజునే గతవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.