క్యా బాత్‌ హై

14 May, 2019 03:29 IST|Sakshi

‘బాహుబలి ’ సినిమా విడుదలైన రెండేళ్లకు ‘బాహుబలి 2’ వచ్చింది. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై రెండేళ్లు దాటింది. తమ అభిమాన హీరో కొత్తచిత్రం కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్‌కి ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ‘సాహో’ సినిమాకి ఆయన స్వయంగా హిందీలో డబ్బింగ్‌ చెప్పి, ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేయనున్నారు. ఇందుకోసం సోనీ అనే టీచర్‌ని పెట్టుకుని నెలపాటు హిందీ భాష నేర్చుకున్నారట ప్రభాస్‌. హిందీ తొలుత కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత నుంచి అలవాటైపోయిందట. ఇక ఆయన డబ్బింగ్‌ చెప్పటమే మిగిలి ఉంది.

కాగా ‘సాహో’కి సంబంధించిన భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని ఇటీవల ముంబయిలో చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుందట. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్‌ 15న ‘సాహో’ ని ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీష్రాఫ్‌ వంటి బాలీవుడ్‌ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌–ఇషాన్‌–లాయ్, కెమెరా: మధి.

మరిన్ని వార్తలు