విభేదాల్లేవు

13 Aug, 2014 00:27 IST|Sakshi
విభేదాల్లేవు

 ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మీల మధ్య విభేదాలు వున్నట్లు పలువురు భావిస్తున్నారని అయితే అటువంటిదేమీ లేదని దర్శకుడు యువరాజ్ బోస్ తెలిపారు. అధర్వ, ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మి నటిస్తున్న చిత్రం ‘ఇరుంబు గుదిరై’. దీనిపై దర్శకుడు యువరాజ్ బోస్ మాట్లాడుతూ అధర్వ వద్ద ఈ చిత్ర కథ వినిపించినపుడు ఎగిరి గంతేశారని అన్నారు. సాధారణ బైక్ అరుులే శిక్షణ అవసరం లేదని, రేస్ బైక్ అయిన దీనికి 8 గేర్లుతో ఎంతో ప్రత్యేకత కలిగివుంటుందని చెప్పానన్నారు.
 
 అందుకు ఈ బైక్ రైడింగ్‌కు తప్పకుండా శిక్షణ తీసుకోవాలని తెలిపానన్నారు. దీంతో ఆయన శిక్షణ తీసుకున్నారని, ఈ బైక్ నడపడం ఎంతో థ్రిల్లింగ్ కలిగించినట్లు చెప్పారన్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆస్ట్రేలియాలో చిత్రీకరించామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఒక నిమిషంలో చేసే పొరపాటు హీరో జీవితంలో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఈ చిత్రం తెలియజేస్తుందన్నారు. అధర్వ బైక్ నడిపే అన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా హెల్మెట్ ధరించారని, ఇది యువతను దారి తప్పించే చిత్రంగా ఉండబోదన్నారు.
 
 రేస్ సన్నివేశాలు పూర్తిగా దానికి సంబంధించిన ట్రాక్‌లో జరిగినట్లు చిత్రీకరించామన్నారు. అగోరం సోదరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రియా ఆనంద్, రాయ్‌లక్ష్మి ఇద్దరూ నటిస్తున్నారని, వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలున్నాయని అయితే అటువంటిదేమీ లేదన్నారు. వీరిరువురూ స్నేహంగా మెలగడమే గాకుండా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. భారత మొదటి మహిళా బైక్ రేసర్ అలిషా అబ్దుల్లా ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు.