40 రోజులు... వందకోట్లు!

26 May, 2016 19:55 IST|Sakshi
40 రోజులు... వందకోట్లు!

హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రా ఇండియాకు వస్తున్నారు. ఏకంగా 40 రోజుల పాటు ఆమె బస ఇక్కడే. అదేంటి ఇంత బిజీలో కూడా ఆమె ఎందుకోసం వస్తున్నారు? సినిమా షూటింగ్ కోసమా? ఏ సినిమాలో నటిస్తున్నారనేదేగా మీ ప్రశ్న. ఆమె వస్తోంది సినిమా కోసం కాదు. తమ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించాల్సిందిగా 24 బహుళజాతి సంస్థలు ప్రియాంకా చోప్రాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ ఏకంగా రూ. 100 కోట్లట. వీటికి సంబంధించిన షూటింగ్స్, ఫొటోషూట్స్ ఇండియాలోనే జరగనున్నాయి.

అందుకే ప్రియాంక పెట్టె బేడా సర్దుకొని ఇండియా రానున్నారు. ప్రస్తుతం ‘బేవాచ్’ టీవీ సిరీస్‌కు తెర రూపంగా వస్తున్న చిత్రంలో ఆమె విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా అక్కడి షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక లాస్ ఏంజిల్స్‌లో ఇల్లు వెతుక్కొనే పనిలో పడ్డారు. అన్నట్లు ఆ మధ్య ఆమె ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కథ వినిపించారనీ, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ వార్తలొచ్చాయి. మరి ఆమె ఇండియాకొచ్చినప్పుడు ఇంకెన్ని కబుర్లు బయటకొస్తాయో!