లబ్బీపేట (విజయవాడ): టాలీవుడ్లో డ్రగ్స్ అంశాన్ని అందరికీ ఆపాదించవద్దని ప్రముఖ నిర్మాత దిల్రాజు విజ్ఞప్తి చేశారు. ఫిదా సినిమా ప్రచారంలో భాగంగా విజయవాడలోని ఓ హోటల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్రగ్స్ విషయాన్ని తాము మీడియా ద్వారానే తెలుసుకున్నామని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే సురేష్బాబు, అల్లు అరవింద్లు వివరణ ఇచ్చారని చెప్పారు.
ఇండస్ట్రీలో ఒకరిద్దరూ డ్రగ్స్కు అలవాటు పడినట్లు ఆరోపణలు వచ్చినంత మాత్రాన అందరికీ ఆపాదించడం సరికాదన్నారు. ఇప్పటికే ఈ అంశంపై సిట్ విచారణ జరుగుతోందని చెప్పారు. తాము కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు శేఖర కమ్ముల, హీరో వరుణ్తేజ్ కూడా పాల్గొన్నారు.