మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక సమాచారం

13 Sep, 2023 11:43 IST|Sakshi

హైదరాబాద్: కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్స్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో అరెస్టైన సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ, మురళిలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వీరివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిపారు. 

మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతినివ్వడంతో బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడినట్టు చెబుతున్నారు పోలీసులు. డ్రగ్స్ పార్టీ సందర్భంగా ఫైనాన్షియర్ వెంకట్ నుంచి 18 మందికి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి డ్రగ్స్ అందుకున్న వారు పరారీలో ఉన్నారని వారంతా ఫోన్లను స్విచాఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు వెల్లడించారు. మరో నాలుగు రోజుల పాటు ఈ నలుగురిని విచారించనున్నట్లు తెలిపారు పోలీసులు.

ప్రాథమిక వివరాలను బట్టి ఆ 18 మందిని కస్టమర్లుగా గుర్తించామని వారికోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారితోపాటు పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్‌ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దించినట్లు తెలిపారు. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకురాగా వారు కూడా ఆ అపార్ట్‌మెంట్‌లోనే పోలీసులకు చిక్కారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు రెండు హత్యలు

మరిన్ని వార్తలు