టీజర్కే రూ.25 కోట్లా..?

6 Nov, 2015 13:05 IST|Sakshi
టీజర్కే రూ.25 కోట్లా..?

బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకన్నా దర్శకుడు రాజమౌళికే ఎక్కువ క్రేజ్ తీసుకు వచ్చింది. ఆ సినిమాతో అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించిన జక్కన్న, తన తదుపరి చిత్రం విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం బాహుబలి 2 కోసం భారీ కసరత్తు చేస్తున్న దర్శకధీరుడు తరువాత చేయబోయే సినిమాపై జాతీయ స్ధాయిలో భారీ చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా బాహుబలి సీరీస్లోనే మరో సినిమా తీస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తొలుత ఈ వార్తలను కొట్టి పారేసిన రాజమౌళి, తరువాత ఈ సిరీస్లో సినిమా ఉండదుగాని ఏదో ఒక రూపంలో బాహుబలి కొనసాగుతుందంటూ మెలిక పెట్టాడు. దీంతో కొత్త కథతో కొత్త తారాగణంతో బాహుబలి 3 తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.

'గరుడ' పేరుతో ఓ పౌరాణిక గాథను రూ. 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజులుగా ఈ టాక్ వినిపిస్తున్నా రాజమౌళి మాత్రం ఇంత వరకు స్పందించలేదు.  అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తుంది.

 

భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న గరుడ సినిమాకు నిర్మాతలను ఆకర్షించడం కోసం రాజమౌళి కొత్త ప్లాన్ చేస్తున్నాడట. రూ. 25 కోట్ల బడ్జెట్తో 25 సెకన్ల టీజర్ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అంతర్జాతీయ స్ధాయి గ్రాఫిక్స్తో రూపొందనున్న ఈ టీజర్ గరుడ సినిమా ఎలా ఉండబోతుందో చూపిస్తుందన్న టాక్ వినిపిస్తొంది. ఇప్పటికైనా రాజమౌళి ఈ వార్తలపై స్పందిస్తాడేమో చూడాలి.