Dhanush Son Yatra: రూల్స్‌ బ్రేక్‌ చేసిన ధనుష్‌ కుమారుడికి ఫైన్‌ వేసిన పోలీసులు

19 Nov, 2023 14:40 IST|Sakshi

తమిళ చిత్రసీమలోనే కాకుండా భారతీయ చిత్రసీమలో కూడా ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు ధనుష్.. రీసెంట్‌గా తెలుగులో 'సార్‌' సినిమాతో మెప్పించాడు. సాధారణ వ్యక్తిలా తన కెరియర్‌ను ప్రారంభించిన ధనుష్‌ ఎంతో కష్టపడి కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.  రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను 2004లో ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమారు 18 ఏళ్ల తర్వాత వారిద్దరి మధ్య ఒక్కసారిగా మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం నుంచి విడివిడిగా ఉంటున్నారు కానీ వారిద్దరి పిల్లలు యాత్ర, లింగ ప్రస్తుతానికి ఐశ్వర్య రజనీకాంత్‌ వద్దే ఉంటున్నారు.

తరుచూ వారిద్దరూ ధనుష్‌ వద్దకు వెళ్తూ ఉంటారు. తాజాగా ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పలు తమిళ మీడియా సంస్థలు కూడా అదే కథనాన్ని ప్రచురించాయి. తన YZF R15 బైక్‌ను నడుపుతున్న సమయంలో యాత్ర హెల్మెట్ లేకుండా పోలీసుల కెమెరాలకు చిక్కాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు.

ఆ సమయంలో అతను తన తాత రజనీకాంత్‌ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో అతివేగంతో ద్విచక్రవాహనాన్ని నడిపిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి నిజంగానే ధనుష్ కొడుకు యాత్రే అని పోలీసులు నిర్ధారించారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1000 జరిమానా విధించారు. 
 

మరిన్ని వార్తలు