కోలీవుడ్‌కు రియా

23 Apr, 2019 10:15 IST|Sakshi

నటి రియా చక్రవర్తి కోలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యింది. ఈ బెంగళూర్‌ బ్యూటీ మొదట్లో మోడలింగ్‌ రంగంలో విజృంభించింది. తరువాత బుల్లితెరపై నటించి, 2012లో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తూనీగ తూనీగా చిత్రంతో పరిచయం అయ్యింది. తరువాత బాలీవుడ్‌లో మకాం పెట్టి అక్కడ నటిస్తోంది. ప్రస్తుతం జిలేబి అనే హింది చిత్రంలో నటిస్తున్న రియా చక్రవర్తికి కాస్త ఆలస్యంగానైనా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. 

యువ నటుడు హరీశ్‌ కల్యాణ్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది రియా. ఇస్పేట్‌ రాజావుమ్‌ ఇదయ రాణియుమ్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం తరువాత హరీశ్‌కల్యాణ్‌ నటిస్తున్న చిత్రం ధనుసు రాశి నేయర్‌గళే. సంజయ్‌ భారతీ దర్శకత్వం వహిస్తున్న త్వరలో సెట్‌ పైకి వెళ్లనుంది. కాగా రొమాంటిక్‌ ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఇందులో హరీశ్‌కల్యాణ్‌కు జంటగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని చిత్ర వర్గాలు ఇంతకు ముందే వెల్లడించాయి. కాగా అందులో ఒకరిగా నటి రియా చక్రవర్తిని ఎంపిక చేశారు.

ఇతర నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్‌ వర్గాలు చెప్పాయి. శ్రీ గోకులం మూవీస్‌ పతాకంపై గోకులం గోపాలన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోతిష్యంపై అపార నమ్మకం కలిగిన ఒక యువకుడి ఇతివృత్తంగా ధనుసు రాశి నేయర్‌గళే చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా పెళ్లికి సిద్ధం అయిన ఆ యువకుడికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్న పలు ఆశక్తికరమైన అంశాలతో వినోదమే ప్రధానంగా చిత్రం ఉంటుందన్నారు.

ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతాన్ని అందించనున్నారని దర్శకుడు సంజయ్‌ భారతీ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. టాలీవుడ్‌లో తూనీగ తూనీగా చిత్రం నటి రియా చక్రవర్తికి పెద్దగా ఉపయోగపడలేదు. తాజాగా కోలీవుడ్‌లో ఈ అమ్మడి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు