మోదీ బయోపిక్‌పై సల్మాన్‌ తీవ్ర అసంతృప్తి

26 Jun, 2019 19:20 IST|Sakshi

ముంబై : ఇటీవలి కాలంలో ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్‌ ఒబేరాయ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు విమర్శలను ఎదుర్కొంది. చిత్రం విడుదల కూడా వాయిదా పడి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాలో పాటలు రాసినట్టు ప్రముఖ పాటల రచయితలు జావేద్‌ అక్తర్‌ , సమీర్‌ల పేర్లను టైటిల్స్‌లో వేసి క్రెడిట్స్‌ ఇచ్చారు. తమకు తెలియకుండా ఇలా చేయడంపై వారు ఒకింత షాక్‌ గురయ్యారు.  ‘ఈశ్వర్ అల్లాహ్’ పాటను ‘1947: ఎర్త్‌’ చిత్రం నుంచి.. ‘సునో గౌర్ సే దునియా వాలో’  పాటను  ‘దస్’ మూవీ నుంచి తీసుకున్నట్లు ఈ చిత్ర నిర్మాత సందీప్‌ సింగ్‌ వెల్లడించారు.  ‘సునో గౌర్ సే దునియా వలో’ పాటను నరేంద్రమోదీ బయోపిక్‌లో  చేర్చడం పట్ల సల్మాన్‌ ఖాన్‌ తీవ్రంగా స్పందిచారు.

సల్మాన్‌ ఖాన్‌, సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, శిల్పాశెట్టీలు కలిసి నటించిన ‘దస్‌’ సినిమాలో ఆ పాట ఉంది. అయితే, ఈ చిత్ర దర్శకుడు ముకుల్‌ ఆనంద్‌ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ‘దస్‌’ మువీ నిర్మాణం అసంపూర్తిగా జరిగి విడుదలకు నోచుకోలేదు. ఈ క్రమంలో సల్మాన్‌ తీవ్రంగా స్పందించారు. నిజానికి సల్మాన్‌కు, వివేక్‌ ఒబేరాయ్‌కి మధ్య చాలాకాలంగా సఖ్యత లేదు. అప్పట్లో ఐశ్వర్యా రాయ్‌తో తాను సన్నిహితంగా వ్యవహరిస్తుండటంతో తనను చంపేస్తానని సల్మాన్‌ తాగి బెదిరించాడని వివేక్‌ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించాడు. దీంతో 15 ఏళ్లుగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్‌ నటించిన  సినిమాలో తన సినిమా పాటను వాడుకోవడంపై సల్మాన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు