మిస్టర్‌ జేమ్స్‌!

6 Nov, 2017 00:50 IST|Sakshi

మలయాళ ఇండస్ట్రీలో మమ్ముట్టి సూపర్‌ స్టార్‌ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన ఓ నూతన దర్శకుడికి, అది కూడా ఓ కెమెరామేన్‌ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకే కెమెరామేన్‌ శ్యామ్‌దత్‌ సైనుద్దీన్‌ దర్శకత్వంలో ఆయన చేస్తోన్న ‘స్ట్రీట్‌లైట్స్‌’ సినిమా హాట్‌ టాపిక్‌ అయింది. తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’,  ‘ఆవకాయ బిర్యానీ’ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్‌ చేశారు శ్యామ్‌దత్‌. ఆయన చెప్పిన కంటెంట్‌లో దమ్ము ఉంది కాబట్టే మమ్ముట్టి ఈ సినిమా చేస్తున్నారని మాలీవుడ్‌ వారు అంటున్నారు. 

ఈ సినిమాలో జేమ్స్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ క్యారెక్టర్‌లో మమ్ముట్టి నటిస్తున్నారు. క్రైమ్‌ అండ్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందట. వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సంగతి అలా ఉంచితే సీనియర్‌ కెమెరామేన్‌–డైరెక్టర్‌ సంతోష్‌ శివన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా స్టార్ట్‌ కానుంది. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో స్టార్ట్‌ అవుతుందని సమాచారం. ఈ సినిమా 16వ శతాబ్దపు బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. సంతోష్‌ శివన్‌ ఆల్రెడీ ‘ఉరిమి’, ‘ఆనందభాద్ర’ చిత్రాలను మలయాళంలో డైరెక్ట్‌ చేశారు. అన్నట్లు.. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘స్పైడర్‌’ సినిమాకు సంతోష్‌శివన్‌నే సినిమాటోగ్రఫర్‌.

మరిన్ని వార్తలు