భాగ్యరాజ్‌ పాత్రలో శశికుమార్‌

7 Apr, 2018 11:29 IST|Sakshi

తమిళ సినిమా : సీనియర్‌ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్‌ పాత్రలో నటుడు శశికుమార్‌ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలను పునర్‌నిర్మించడం చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే ఇటీవల సీక్వెల్స్‌ నిర్మాణం అధికం కావడంతో పాత చిత్రాల రీమేక్‌ తగ్గింది. తాజాగా నటుడు శశికుమార్‌ ఆ ట్రెండ్‌కు తెరలేపనున్నారు. 

1982లో నటుడు కే.భాగ్యరాజ్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం తూరల్‌ నిండ్రు పోచ్చు. ఇందులో నటి సులోచన కథానాయకిగా నటించారు. ముఖ్య పాత్రలో నంబియాన్‌ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం ఇప్పుడు నటుడు శశికుమార్‌ కథానాయకుడిగా రీమేక్‌ కానుంది. ఈ విషయాన్ని నట దర్శకుడు కే.భాగ్యరాజ్‌ ధ్రువీకరించారు. నటుడు శశికుమార్‌ కూడా ఈ ప్రచారాన్ని ధ్రువపరిచారు.

దీని గురించి ఆయన తెలుపుతూ కే.భాగ్యరాజ్‌ నటించిన తూరల్‌ నిండ్రు పోచ్చు చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్ర కథను నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పునర్‌నిర్మాణం జరపనున్నట్లు చెప్పారు.ఇందులో కే.భాగ్యరాజ్‌ పాత్రను తాను, నంబీయార్‌ పాత్రలో రాజ్‌కిరణ్‌ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శశికుమార్‌ సముద్రఖని దర్శకత్వంలో నాడోడిగళ్‌ 2లో నటిస్తున్నారు. మరో చిత్రం అసురవధం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.

మరిన్ని వార్తలు