ఒకే వేదికపై నాలుగు వేడుకలు

19 Jan, 2018 13:53 IST|Sakshi

ఒకే వేదికపై నాలుగు చిత్రాల వేడుకలు జరగడం అరుదైన విషయమే అవుతుంది. అదీ ఒకే నిర్మాత చేస్తున్న చిత్రాలు కావడం మరో విశేషం. అలాంటి వేడుకలకు బుధవారం సాయంత్రం చెన్నై, వడపళనిలోని ఒక నక్షత్ర హోటల్‌ వేదికైంది. స్టూడియోగ్రీన్‌ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్‌రాజానే ఈ అరుదైన వేడుకలను నిర్వహించారు. ఆయన నిర్మించిన భారీ చిత్రం తానాసేర్నదకూట్టం. సూర్య, కీర్తీసురేశ్‌ జంటగా నటించిన ఇందులో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. గత వారం తెరపైకి వచ్చిన తానాసేర్నదకూట్టం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ బుధవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. 

అదే వేదికపై నటి అనుష్క టైటిల్‌ పాత్ర పోషించిన ద్విభాషా చిత్రం భాగమతి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ చిత్ర తమిళ హక్కులను జ్ఞానవేల్‌ రాజా దక్కించుకున్నారు. ఇలాఉండగా జ్ఞానవేల్‌ రాజా తాజాగా ఆర్య, సాయేషాసైగల్‌ జంటగా గజనీ కాంత్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్‌.పీ జయకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలమురళీబాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం రెండవ సింగిల్‌ సాంగ్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే వేదికపై ఆవిష్కరించారు. 

ఒక జ్ఞానవేల్‌రాజాకు చెందిన మరో నిర్మాణ సంస్థ బ్లూ గోస్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు. గౌతమ్‌కార్తీక్, వైభవి శాండిల్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ పీ.జయకుమార్‌ దర్శకుడు. ఈ చిత్ర సింగిల్‌ సాంగ్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఇదే వేదికపై జరిగింది. నాలుగు చిత్రాల తారలు, సాంకేతిక వర్గంతో వేదిక కళ కళలాడింది. వీటిలో నటి అనుష్క నటించిన భాగమతి చిత్రం ఈ నెల 26వ విడుదలకు ముస్తాబవుతోందన్నది గమనార్హం.

>
మరిన్ని వార్తలు