బస్సులో మిస్సుతో...!

23 May, 2016 23:27 IST|Sakshi
బస్సులో మిస్సుతో...!

ఓ లక్ష్యాన్ని సాధించడానికి తపన పడే ఒక యువకుడు అనుకోకుండా బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్‌లో అతనికో మిస్సు  పరిచయమవుతుంది. ఆమెతో ఈ కండక్టర్‌కు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? చివరకు ఏమైంది? తెలియాలంటే మా ‘రైట్ రైట్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు హీరో సుమంత్ అశ్విన్. మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీసత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది.

‘బాహుబలి’ ప్రభాకర్ ఇందులో ప్రధాన పాత్ర చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నేనిప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇందులో చాలా భిన్నమైన పాత్ర చేశా. నా క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేశా. మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం మిస్టరీగా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్‌ది ఈ చిత్రంలో కీలక పాత్ర. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది.  సుమంత్ అశ్విన్ కెరీర్‌లో చెప్పకోదగ్గ చిత్రం అవుతుంది.

ప్రభాకర్ పాత్ర ఇందులో హైలెట్‌గా నిలుస్తుంది. జె.బి. స్వర పరచిన పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. అన్నివర్గాల వారు చూసేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం  విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్,  తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసఫ్, సహ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు.