నాకంటే అదృష్టవంతురాలెవరూ ఉండరు

30 Dec, 2019 08:01 IST|Sakshi

సినిమా: నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చింది నటి తమన్నా. తన గురించి తాను అలా చెప్పుకోవడంలో తప్పులేదనుకుంటా. ఎందుకంటే  తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా తనకుంటూ ఒక గుర్తింపు పొందిన నటి తమన్నా. నటిగా దశాబ్దన్నర అనుభవాన్ని గడించిన ఈ బ్యూటీ మొదట్లో అందరి మాదిరిగానే అందాలారబోతకే పరిమితం అయినా, బాహుబలి వంటి కొన్ని చిత్రాల్లో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి శభాష్‌ అనిపించుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో నటిస్తోంది. ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని అంది. అన్ని భాషల్లోనూ నటించానని, ఇండియాలోనే తనను తెలియనివారు ఎవరూ ఉండే అవకాశం లేదని అంది. అంతగా పాపులర్‌ అయ్యానని చెప్పింది. అంతగా పేరు, ప్రఖ్యాతలు లభించడం సంతోషంగా ఉందని అంది. తెలుగులో బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించానని, ఆ చిత్రాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందానని అంది. ఇంతకు ముందే హిందీ చిత్రాల్లో నటించానని, ప్రస్తుతం మళ్లీ నటిస్తున్నానని చెప్పింది.

ఇప్పుడు నవాజుద్దీన్‌ సిద్ధిక్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పింది. కాగా ప్రేక్షకులు తనను కొత్తగా నటించడానికి వచ్చిన నటిగా చూడాలని, అప్పుడే తానూ ఇంతకు ముందు నటించినదంతా మరచి కొత్తగా పరిచయం అయిన నటిగా నటించగలనని అంది. ఇకపోతే తన సౌందర్య రహస్యం గురించి అడుగుతున్నారని, అందుకు తన ఆహారపు అలావాట్లే కారణం అని చెప్పుకొచ్చింది. తన ఆహార నియమావళి గురించి చెప్పాలంటే  ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగుతానని చెప్పింది. ఆ తరువాత నానబెట్టిన బాదంపప్పును కొంచెం తింటానని చెప్పింది. ఆ తరువాత ఇడ్లీ, దోశ, ఓట్స్‌ వంటి వాటిలో ఒక దాన్ని స్పల్పాహారంగా తీసుకుంటానని చెప్పింది. ఇకపోతే మధ్యాహ్నం ఒక కప్పు అన్నంతో ఎక్కువ కాయగూరలు తీసుకుంటానని చెప్పింది. రాత్రికి మాత్రం ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్డు, చికెన్‌ వంటిని భుజిస్తానని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజూ యోగా, ఎక్సర్‌సైజులు క్రమం తప్పకుండా చేస్తానని చెప్పింది. ఇవే తన అందానికి, ఆరోగ్యానికి సూక్తులు అని తమన్నా పేర్కొంది.

మరిన్ని వార్తలు