ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు

7 Feb, 2014 04:07 IST|Sakshi
ముగ్గురు హీరోల వారసులతో సినిమాలు
తమిళంలో అగ్ర నిర్మాత కలైపులి. ఎస్.థాను. తెలుగులో వెంకటేశ్‌తో ‘ఘర్షణ’, విక్రమ్‌తో ‘మల్లన్న’ సినిమాలు తీసిన థాను ప్రస్తుతం తమిళంలో మూడు సంచలన చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ మూడూ కూడా ముగ్గురు ప్రముఖ కథానాయకుల వారసులవి కావడం విశేషం. సీనియర్ హీరో ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా ‘అరిమానంబి’ పేరుతో ఓ చిత్రం తయారవుతోంది. ఇందులో ప్రియా ఆనంద్ కథానాయిక. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 
 
 మురుగదాస్ శిష్యుడు ఆనంద్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అలాగే మరో చిత్రం ‘కనిదన్’లో ఒకప్పటి హీరో మురళి కొడుకు అధర్వ హీరో. కేథరిన్ కథానాయిక. దీనికి మురుగదాస్ మరో శిష్యుడు సంతోష్ దర్శకుడు. ఈ రెండు చిత్రాల ద్వారా ప్రముఖ డ్రమ్మర్ శివమణి సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇక థాను నిర్మిస్తోన్న మూడో చిత్రం ‘ఇంద్రజిత్’. ఇందులో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరో. థాను తనయుడు కళాప్రభు దర్శకుడు.