దుమ్మురేపుతున్న టైగర్‌.. భారీగా వసూళ్లు!

23 Dec, 2017 18:03 IST|Sakshi

ముంబై: ఈ ఏడాది పెద్ద సూపర్‌హిట్లు లేక డీలాపడిన బాలీవుడ్‌కు సల్మాన్‌ ఖాన్‌ తాజా సినిమా 'టైగర్‌ జిందా హై' సంవత్సరాంతంలో కొత్త ఊపిరినిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు యావరేజ్‌ రివ్యూలు వచ్చినా.. సల్మాన్‌ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ మౌత్‌టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5700 థియేటర్లలో విడుదలైన 'టైగర్‌ జిందా హై' సినిమా మొదటిరోజు రూ. 33 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినీ ట్రేడ్‌ నిపుణుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

బాహుబలి-2 తర్వాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'టైగర్‌ జిందా హై' రికార్డు సాధించింది. ఇటు ఇండియాలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా 'టైగర్‌' బాక్సాఫీస్‌ వద్ద గర్జిస్తోందని, యూఏఈలో రూ. 6 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ. 1.01 కోట్లు, న్యూజిల్యాండ్‌లో రూ. 38.54 లక్షలు వసూలు చేసిందని, అయితే, కువైట్‌లో ఈ సినిమా విడుదలను నిషేధించడంతో రెండు కోట్ల వరకు నష్టపోయిందని తరణ్‌ ఆదర్శ్‌ వివరించారు.

ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూలుచేసిన టాప్‌-5 సినిమాలు ఇవే
1. బాహుబలి 2           - రూ. 41 కోట్లు
2. టైగర్‌ జిందా హై        - రూ.33.75 కోట్లు
3. గోల్‌మాల్‌ అగైన్‌       - రూ.30.14 కోట్లు
4. ట్యుబ్‌లైట్              -  రూ.21.15 కోట్లు
5.  రాయిస్               - రూ.20.42 కోట్లు

మరిన్ని వార్తలు