అంతరిక్షంలో థ్రిల్‌

20 Apr, 2018 00:49 IST|Sakshi
క్రిష్, లావణ్య, అదితి, సంకల్ప్, వరుణ్‌ తేజ్, రాజీవ్‌ రెడ్డి, బిబో శ్రీనివాస్‌

వరుస విజయాలతో మాంచి జోరు మీద ఉన్నారు హీరో వరుణ్‌తేజ్‌. తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా హైదరాబాద్‌లో గురువారం ప్రారంభమైంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాజీవ్‌రెడ్డి ఎదుగురు, రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌), సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సంకల్ప్‌ రెడ్డి తండ్రి సహదేవ్‌ వీర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, వరుణ్‌ తేజ్‌ తండ్రి నాగబాబు క్లాప్‌ ఇచ్చారు.

చిత్ర సహనిర్మాత క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ ఫ్రేమ్‌ సంస్థలో రూపొందుతున్న ఆరవ చిత్రమిది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది. అంతరిక్షం నేపథ్యంలో కథ సాగుతుంది. వరుణ్‌ తేజ్‌ వ్యోమగామిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో  తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం పలు స్టూడియోల్లో భారీ సెట్స్‌ వేశాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాయి’’ అన్నారు.  సత్యదేవ్, రాజా, అవసరాల, రెహ్మాన్‌ (రఘు) నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారీ.
 

మరిన్ని వార్తలు