విజయ్‌సేతుపతితో రెండోసారి మడోనా రొమాన్స్

10 Jun, 2016 01:43 IST|Sakshi
విజయ్‌సేతుపతితో రెండోసారి మడోనా రొమాన్స్

నటి మడోనా సెబాస్టియన్‌కు నటుడు విజయ్‌సేతుపతి సిఫారసు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందుకు కారణం లేక పోలేదు. విజయ్‌సేతుపతి, మడోనా సెబాస్టియన్ ఇంతకు ముందు కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం చాలా సెలైంట్‌గా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెరపైకి వచ్చి అంతే సెలైంట్‌గా విజయపథంలో నడిచింది.
 
 మలయాళ చిత్రం ప్రేమమ్ నాయికల్లో ఒకరైన మడోనా సెబాస్టియన్ తమిళంలో నటించిన తొలి చిత్రం కాదలుమ్ కడందుపోగుమ్.ప్రస్తుతం ప్రేమమ్ చిత్ర తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్న ఈ కేరళ కుట్టికి తమిళంలో మరో అవకాశం వచ్చింది. విశేషం ఏమిటంటే మళ్లీ తన తొలి చిత్ర హీరో విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు.
 
 అనేగన్ చిత్రం తరువాత దర్శకుడు కేవీ.ఆనంద్ తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇందులో విజయ్‌సేతుపతి, మడోనా సెబాస్టియన్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ ఈ క్రేజీ చిత్రాన్ని నిర్మించనుంది.ఇందులో సినీయర్ నటుడు టి.రాజేందర్ ముఖ్యపాత్ర పోషించనుండడం విశేషం. హిప్‌హాప్ తమిళ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, సంభాషణలను దర్శకుడు కేవీ.ఆనంద్‌తో కలిసి శుభ,కపిలన్ వైరముత్తు రాస్తున్నారు.
 
  ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించారు. చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం అవుతుందని తెలిపారు. దీనికి అభినందన్ చాయాగ్రహణం నెరపనున్నారు. ఈ చిత్రంలో నటుడు విజయ్‌సేతుపతి సిఫారసు కారణంగానే నటి మడోనా సెబాస్టియన్‌కు అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
 
 అయితే ఈ ప్రచారంలో నిజం లేదని, కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రంలో మడోనా సెబాస్టియన్ నటనను చూసి కేవీ.ఆనంద్ ఆమెను ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. తొలి చిత్రంలోనే విజయ్‌సేతుపతి, మడోనా సెడాస్టియన్ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకోవడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చునని అంటున్నారు. ఏదేమైనా మడోనాకు కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చిందన్న మాట.