Santhanam: దాదాపు రూ. లక్షన్నర తీసుకునే స్థాయి నుంచి కోట్లు డిమాండ్‌ చేస్తోన్న హీరో

20 Nov, 2023 10:02 IST|Sakshi

హీరో సంతానం రూ.30 కోట్లు తీసుకునే స్థాయికి ఎదగాలని నిర్మాత జ్ఞానవేల్‌ రాజా పేర్కొన్నారు. ఈయన తన స్టూడియో గ్రీన్‌ పతాకంపై సంతానం హీరోగా 80స్‌ బిల్డప్‌ అనే సినిమా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి రాధిక ప్రీతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆడుగళం నరేన్‌, దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌, మొటై రాజేంద్రన్‌, ఆనంద్‌రాజ్‌, దర్శకుడు సుందర్‌రాజన్‌, తంగదురై, స్వామినాథన్‌, కుంకీ అశ్విన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాకప్‌ రత్నరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు.

అప్పట్లో రూ.1.75 లక్షల పారితోషికం
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కల్యాణ్‌ మాట్లాడుతూ.. 'నాళయ ఇయక్కునార్‌ సీజన్‌ నుంచి బయటకు రాగానే దర్శకత్వం వహించాలని కలలు కన్నానన్నారు. దానిని నెరవేర్చింది నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా' అని పేర్కొన్నారు. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా మాట్లాడుతూ.. తాను జిల్లని వర్‌ ఖాదర్‌ చిత్రాన్ని నిర్మించినప్పుడు అందులో నటించిన సంతానంకు రూ.1.75 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చానన్నారు. ఇప్పుడు ఆయన హీరోగా రూ.3 కోట్లు తీసుకుంటున్నారని, రూ.30 కోట్లు తీసుకునే స్థాయికి సంతానం ఎదగాలని కోరుకుంటున్నానన్నారు.

అవకాశాల్లేక ఖాళీగా ఉన్నప్పుడు..
సంతానం మాట్లాడుతూ.. జ్ఞానం ఉన్న నిర్మాత జ్ఞానవేల్‌ రాజా అని పేర్కొన్నారు. 2024 అంతా ఆయనదే అని పేర్కొన్నారు. తాను నటించిన చిత్రాలు సరిగ్గా ఆడక ఇంటిలోనే కూర్చొన్నప్పుడు జ్ఞానవేల్‌ రాజా వచ్చి సలహాలు ఇచ్చేవారన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను దర్శకుడు కల్యాణ్‌ 20 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్స్‌ కంటే తమ చిత్ర షూటింగ్‌లోనే కెమెరాలు అధికంగా ఉండేవని సంతానం పేర్కొన్నారు.

చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్

మరిన్ని వార్తలు