సృష్టిలో ఏదైనా సాధ్యమే

16 Feb, 2019 02:50 IST|Sakshi
నందితారాజ్

‘‘గీతాంజలి, త్రిపుర’ వంటి థ్రిల్లర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్‌ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్‌ ఎస్‌., రాజకిరణ్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 21న, సినిమాని మార్చి 21న విడుదల చేయనున్నారు. రాజకిరణ్‌ మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్‌  చిత్రమిది.

న్యూజిలాండ్, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి, ఈ కథ రాసుకున్నా. నందితారాజ్‌ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో చెప్పడానికి మనుషులు ఎవరు? ఇక్కడ ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా సినిమా. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ తెరకెక్కించాం’’ అన్నారు. విద్యుల్లేఖారామన్, పరుచూరి వెంకటేశ్వరరావు, జీవా, ‘చమ్మక్‌’ చంద్ర, ‘గెటప్‌’ శ్రీను, ‘రాకెట్‌’ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ బండారి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

మరిన్ని వార్తలు