‘బూతులు తిడుతూ.. దాడి చేశారు’

4 Aug, 2018 11:41 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొనేలపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఓర్లాండో(ఫ్లోరిడా) డిస్నీ ల్యాండ్‌ ఆ జంట చక్కర్లు కొడుతున్న ఫోటోలు కొన్నిరోజుల క్రితం వైరల్‌ అయ్యాయి. అయితే ఆ సమయంలో వీడియో తీసిన ఓ మహిళతో వీరిద్దరూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాధితురాలు జైనబ్‌ ఖాన్‌ సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు ఉంచారు. 

‘నేను ఆమెకు(దీపిక) వీరాభిమానిని. కానీ, ఆరోజు జరిగిన ఘటన భయానకం. నేనేం వారి వెంటపడలేదు. హఠాత్తుగా నా కళ్ల ముందు కనిపించారు. కెమెరాతో వీడియో తీశా. అది గమనించిన ఆమె నవ్వుతూ నా దగ్గరికొచ్చారు. ఫోటోకు ఫోజు ఇస్తారేమో అనుకుంటే.. నాపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నాపై దుర్భాషలాడారు. ఆమెకు రణ్‌వీర్‌ కూడా జత కలిశాడు. సెలబ్రిటీల కోసం పాకులాడితే ప్రతిఫలం ఇంత దారుణంగా ఉంటుందా? అన్నది అనుభవమైంది. వారిపై గౌరవం పోయింది’ అని ఆమె వివరించారు.

వీడియోతోసహా జైనబ్‌ పెట్టిన పోస్టులపై పలువురు మండిపడుతున్నారు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం అంత దారుణంగా ప్రవర్తించాలా? అని తిట్టి పోస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రణ్‌వీర్‌-దీపికా స్పందించలేదు. ఇదిలా ఉంటే నవంబర్‌లో ఈ జంట వివాహంతో ఒక్కటి కాబోతున్నట్లు కథనాలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని వార్తలు