‘మహానాయకుడి ‘యాత్ర’ను సెలబ్రేట్‌ చేసుకుందాం’

6 Feb, 2019 13:09 IST|Sakshi

దివం‍గత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మహి వీ రాఘవ్‌ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు. మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్‌ తన టీంతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావటం వరంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరించిన వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులకు, కోట్లాది కూడా ఉన్న ఆయన అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాను మరే సినిమాలో పోల్చటం గానీ, పోటిగా చూపించటం కానీ చేయకండి. ఆ మహానాయకుడి యాత్రను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం.

ఎన్టీఆర్ గారూ, వైఎస్‌ఆర్‌గారూ ఈ మట్టి వారసులు, ఎంతో కీర్తిని, గౌరవాన్ని మనకు వదిలి వెళ్లిన తెలుగు లెజెండ్స్‌‌. మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. వైఎస్‌ఆర్‌, చిరంజీవి గారిపట్ల నా ప్రేమ కారణంగా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు. మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్న’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు