బీ-టౌన్‌ సెలబ్రిటీలపై సంచలన ఆరోపణలు

23 Jul, 2020 12:39 IST|Sakshi

బాలీవుడ్‌ సెలబ్రిటీలపై మాజీ ఎంపీ జై పాండా షాకింగ్‌ కామెంట్లు

న్యూఢిల్లీ: యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌ ‘పెద్దల’పై బంధుప్రీతి, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ బైజయంత్‌ జై పాండా మరో బాంబు పేల్చారు. పాకిస్తాన్‌ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐ, పాక్‌ సైన్యంతో పలువురు బీ-టౌన్‌ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో హింసను ప్రేరేపిస్తున్న పాకిస్తానీలు, ఎన్‌ఆర్‌ఐలతో వీరు వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారని.. తద్వారా పరోక్షంగా పాక్‌ ఆర్మీకి సహాయపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి దేశభక్తి గల బాలీవుడ్‌ నటులు ఇలాంటి వాళ్లతో కలిసి పనిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. అయితే ఇందులో ఆయన ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.(హ‌ర్ట్ అయ్యుంటే సారీ చెప్తాను: అనురాగ్‌)

కాగా ఒడిశాకు చెందిన జై పాండా ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇక జై పాండా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి ద్రోహులను ఏరివేయాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కొంతమంది డిమాండ్‌ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఈ ఆరోపణలు నిజమే అయితే ఇన్నాళ్లు నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు పాల్పడిన నాటి నుంచి బాలీవుడ్‌లో నెపోటిజంపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌, కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తదితరులపై సుశాంత్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అదే విధంగా అవుట్‌సైడర్ల తరఫున గళమెత్తిన కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. 

మరిన్ని వార్తలు