వలస కూలీలను బూటుకాలితో తన్నిన పోలీస్‌

12 May, 2020 10:25 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలురైళ్లను నడుతున్నా.. అనుమతులు లభించక చాలామంది కార్మికులు పడిగాపులు గాస్తున్నారు. పాసుల కోసం వెళ్లగా పలుచోట్ల వలస కార్మికులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. తాము స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ బెంగుళూరులోని కేజీ హోలీ పోలీస్ట్‌ స్టేషన్‌కు వెళ్లిన కార్మికులపై స్థానిక అధికారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కార్మికుడిపై చేయి చేసుకోవడమే కాకుండా బూటుకాలితో తన్ని పరిగెత్తించారు. ఈ వీడియోకాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో ఉన్నతాధికారులు స్పందించి అతన్ని విధుల్లోనుంచి తొలగించారు. (రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ)

సోమవారం జరిగిన ఈ ఘటనపై సీనియర్‌ పోలీస్‌ అధికారి ఎస్‌డీ శరనప్ప మాట్లాడుతూ.. ‘ఉత్తర ప్రదేశ్‌కి చెందిన కొంతమంది వలస కూలీలు స్థానిక పోలీస్‌‌ స్టేషన్‌కు వచ్చారు. తాము స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే  ఏఎస్‌ఐ రాజా సాహెబ్‌ వారితో దుర్భాషలాడారు. అంతేకాకుండా చేయి చేసుకుని బూటుకాలితో తన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు  ఏఎస్‌ను సస్పెండ్‌ చేశాము’ అని వివరించారు. (వైద్యుడి సాహసంపై ప్రశంసల జల్లు)

మరిన్ని వార్తలు