సీఎస్‌, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమావేశం

25 Apr, 2020 12:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌ గాబా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతున్నారు.  అన్ని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో భాగమయ్యారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఆయన ఆరా తీస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంపై వివరణాలను సేకరిస్తున్నారు. కోవిడ్-19 నివారణ చర్యలు, గ్రీన్ జోన్లలో మినహాయింపులు, వలస కూలీల సమస్య, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల అంశాలు సమీక్షలో చర్చకు వచ్చాయి. (భారత్‌లో 775కు చేరిన కరోనా మృతుల సంఖ్య)

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ కారణంగా 57మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 775కి చేరింది. దేశవ్యాప్తంగా శనివారం ఉదయం నాటికి మొత్తం 24,506 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  అలాగే 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా,  5,063 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు