సాక్షి, న్యూఢిల్లీ: తొలి తెలుగు ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 95వ జయంతి సందంర్భంగా మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పలువురు నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్,కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు దత్తాత్రేయ మాట్లాడుతూ పీవీ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేశారని, ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పార్లమెంట్లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కోరారు.
కష్టకాలంలో ముందున్నారు: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కూడా పీవీకి నివాళి అర్పించారు. పీవీ కష్టకాలంలో జాతిని ముందుండి నడిపించారని , ఆయన నాయకత్వం దేశానికి ఎంతో కీలకమైందని, గుర్తుంచుకోదగినదని ట్వీట్ చేశారు.