ఏప్రిల్‌ 23న బ్లాక్‌డేనా?

20 Apr, 2020 20:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైనా ప్రాణాలను కాపాడే డాక్టర్లు మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి  బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల డాక్టర్లపై , వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. దీన్ని ఇండియన్‌ మెడికల్‌ ఆసోసియేషన్‌ చాలా సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వైద్యలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరిస్తున్న కొందరిలో మార్పు రావడం లేదు. (గాంధీలో కరోనా మరణం.. వైద్యులపై బంధువుల దాడి)

డాక్టర్లపై దాడులు చేస్తే చర్యలు తీసుకొనే చట్టాన్ని ప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదని భావించిన ఐయమ్‌ఏ ఇలాంటి చర్యలు పునరావృతమైతే ఏప్రిల్‌ 23 వతేదీనీ బ్లాక్‌డే గా ప్రకటిస్తామని హెచ్చరించింది. దీనికి సంబంధించి సోమవారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నోటీసులు ఇచ్చింది. ‘మాకు సురక్షితమైన పని ప్రదేశాలు కావాలి. మనపై జరుగుతున్న దాడులు, హింస వెంటనే ఆపేయాలి. ముందస్తు హెచ్చరికగా వైద్యులు అందరూ ఏప్రిల్‌ 22 వతేదీ రాత్రి 9 గంటలకు మా పై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా క్యాండెల్‌ను వెలిగిస్తారు ’ అని ఐయమ్‌ఏ పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన, సామాజిక దూరం విషయంలో పాటించాల్సిన నియమాలు, వైద్యలపై జరుతున్న దాడుల గురించి రిపోర్టు ఇవ్వాల్సిందిగా కేంద్రం ఆరుగురు మంత్రులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది.   (మాత్ భ్యులపై అస్త్రం ప్రయోగించిన యోగి)

మరిన్ని వార్తలు