2020లో చంద్రయాన్‌–3?

15 Nov, 2019 02:46 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది నవంబర్‌లో చంద్ర యాన్‌–3 ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్‌–2 ప్రయోగం ద్వారా ల్యాండర్‌ను చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం నిరాశకు గురైనా.. ఇస్రోలో పట్టుదలను పెంచింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి తీరాలనే దృఢనిశ్చయానికి వచ్చిన ఇస్రో చంద్రయాన్‌–3 చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది.

తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌ సోమనాథ్‌ అధ్యక్షతన పనిచే స్తున్న ఈ కమిటీ అక్టోబర్‌ నుంచి 4 సార్లు సమావేశమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు, ప్రణాళికలతో కూడిన నివేదిక ను ఇది సమర్పించనుంది. ఈ నివేదిక అందాక ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం పట్టాలెక్కిస్తారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్‌–2లోని ఆర్బిటర్‌ విజయ వంతంగా పనిచేస్తున్నందున వచ్చే ఏడాది ల్యాండర్, రోవర్‌లనే చంద్రుడిపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు