‘సంతోషంగా ఉంది.. మళ్లీ కేరళకు వస్తాను’

21 Apr, 2020 11:45 IST|Sakshi

కోవిడ్‌-19 నుంచి కోలుకున్న ఇటాలియన్‌ పర్యాటకుడు

తిరువనంతపురం: ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నర్సులు, డాక్టర్లు ఇలా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. అంతా సర్ధుకున్న తర్వాత మళ్లీ ఇక్కడికి వస్తాను. కేరళ చాలా సురక్షితమైన ప్రదేశం’’అని కరోనా నుంచి కోలుకున్న ఇటాలియన్‌ పర్యాటకుడు రాబర్టో టోనిజో హర్షం వ్యక్తం చేశారు. ఇటలీకి చెందిన రాబర్టో మార్చి 13న కేరళ అందాలను వీక్షించేందుకు భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో అతడికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని క్వారంటైన్‌కు పంపిన కేరళ ప్రభుత్వం చికిత్స అందించింది. (పోలీసుల కోసం ఉన్నంతలోనే ఉదారత..)

ఈ క్రమంలో మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలడంతో సోమవారం అతడిని డిశ్చార్జ్‌ చేశారు. అనంతరం రాబర్టోను బెంగళూరుకు ప్రత్యేక వాహనంలో తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడి నుంచి అతడు ఇటలీకి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాబర్టో.. కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘కేరళ నా ఇల్లు వంటిది. ఇక్కడ ఎవరైనా సురక్షితంగా ఉండగలరు. నేను నా దేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. అయితే మరోసారి కచ్చితంగా ఇక్కడికి వస్తాను’’అని పేర్కొన్నాడు. కాగా మున్నార్‌లో ఓ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న ఏడుగురు విదేశీయులు(యూకే, ఇటలీకి చెందినవారు) కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఏప్రిల్‌ 9న వెల్లడించిన విషయం తెలిసిందే.  (లాక్‌డౌన్‌: కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్‌)

మరిన్ని వార్తలు