ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్

17 Jun, 2016 20:22 IST|Sakshi
ఇంటర్నెట్ సేవలు మళ్లీ బంద్

విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నం
జమ్ములో తీవ్ర ఉద్రిక్తత.. నిందితుడి అరెస్టు

జమ్మూలో పురాతన శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటనతో చెలరేగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చల్లబడక ముందే మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఓ సస్సెండ్ అయిన జమ్మూకాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్... స్థానిక ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నానక్ నగర్ లోని శివాలయ ధ్వంసానికి ఓ వ్యక్తి ప్రయత్నించడం మరోసారి అలజడి రేగింది. దీంతో మూడు రోజులుగా  ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

జమ్మూలో గురువారం జరిగిన పురాతన శివాలయ ధ్వంసం ఘటన మరువక ముందే మరో అలజడి రేగింది. సస్పెండెడ్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ నానక్ నగర్ లోని ఆలయంలోకి వెళ్ళి అక్కడి శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో  పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆలయధ్వంసం ఘటన తెలియడంతో స్థానికులు నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు. అంతకు ముందు రూప్ నగర్ లో జరిగిన ఆలయ ధ్వంసానికి, తాజా ఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జమ్మూలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.  

అయితే రెండు రోజులుగా ఆందోళనలతో ఉన్న జమ్మూలో నేడు కొంత ప్రశాంత వాతావరణం కనిపించింది. వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపై ట్రాఫిక్ కూడా ఎప్పట్లాగే కనిపించింది. అయితే స్థానికంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు మాత్రం కొనసాగడం లేదు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు స్తంభించిపోయాయి. దక్షిణ కాశ్మీర్ లో అమరనాథ్ యాత్ర సందర్భంలోనే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రణాళికా బద్ధంగా దేవాలయాలను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్న అనుమానంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అయితే నిందితుడు నానక్ నగర్ ఆలయధ్వంసానికి పాల్పడే ముందు సెల్ ఫోన్ లో ఇతరులతో విషయాన్ని వివరించినట్లు జమ్ము డివిజినల్ కమిషనర్ పవన్ కొత్వాల్ తెలిపారు. నానక్ నగర్ ఆలయంలో శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ గుర్బచన్ సింగ్ అలియాస్ మింటా గా గుర్తించామని, అతడు ఘటనకు ముందు మాట్లాడిన సెల్ ఫోన్ సంభాషణను బట్టి అతడ్ని ఆదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఫోన్ లో అవతలి వ్యక్తితో సింగ్...  చెప్పిన పని పూర్తయిందని, తన ఖాతాలో డబ్బు జమచేయమని చెప్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం సింగ్ ను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జమ్ము డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సిమరన్ దీప్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించిన ప్రభుత్వం జమ్మూలో మాత్రం మూడోరోజూ నిలిపివేతను కొనసాగిస్తోంది. అంతకుముందు జరిగిన నిరసన ప్రదర్శనలలో వేర్పాటువాదులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను ఎగరేశారు.

మరిన్ని వార్తలు