నన్ను భారత్‌ ఆర్మీ కాపాడింది : ఉగ్రవాది

10 May, 2018 17:41 IST|Sakshi

కశ్మీర్‌ : నన్ను ఇండియన్‌ ఆర్మీ  కాపాడింది.. ఈ మాట చెప్పింది ఓ కరుడు కట్టిన ఉగ్రవాది. బారాముల్లాలో భారత సైనికులతో పాటు, ప్రజలపై దాడులకు పాల్పడుతూ పట్టుబడిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు. ఓ వీడియో విడుదల చేస్తూ.. హింసను విడనాడాలంటూ తనతోటి స్నేహితులు, మిలిటెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరు అజీజ్‌ అహ్మద్‌ గోజ్రీ అని చెప్పిన అతడు, తన స్నేహితులు సుహైన్‌ అభూబ్‌, మొహసీన్‌ ముస్తాక్‌ భట్‌, నాసిర్‌ అమిన్‌ డ్రాజీలను ఉగ్రవాదం విడిచి తమ స్వస్థలాలకు రావాలంటూ కోరాడు..

ఇళ్లను, తల్లిదండ్రులను విడిచి, తప్పుడు మార్గంలో వెళ్తూ.. అడవుల్లో జీవించే తర స్నేహితులు ఇంటికి రావాలంటూ కోరాడు. ఆర్మీ అధికారులు తనను అరెస్టు చేసినప్పుడు, చంపే అవకాశం ఉన్నా, చంపకుండా జీవితాన్ని కాపాడారని వెల్లడించాడు. అంతకు ముందు రోజే పాకిస్తాన్‌ తనతో భారత భద్రతా బలగాలు చాలా క్రూరమైనవని అంటూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ అది వాస్తవం కాదన్నాడు. భారత ఆర్మీ అధికారులను కలిస్తే అసలు విషయం బోధపడుతుందన్నాడు. ఇదంతా పాకిస్తాన్‌ చేసే కుట్రని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌, లష్కరే తోయిబా  కాశ్మీరీ యువత జీవితాలతో ఆడుకుంటోందని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

గత ఏప్రిల్‌ 30న ఉత్తర కశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. వారిలో నలుగురు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారి స్వయం ప్రకాశ్‌ మాట్లాడుతూ లష్కరే తోయిబా కు చెందిన ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని చెప్పడానికి తమ దగ్గర చాలా సాక్షాలు ఉన్నాయని తెలిపారు. మిగిలిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు