‘విమానయాన రంగంలో భారీ సంస్కరణలు’

16 May, 2020 18:58 IST|Sakshi

నాలుగో విడత ప్యాకేజీని ప్రకటించిన నిర్మలా సీతారామన్

సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో భారీ సంస్కరణలు తీసుకునాబోతున్నట్లు కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె విమానయాన రంగం గురించి మాట్లాడుతూ.. దేశంలో ఆరు ఎయిర్‌పోర్టులను వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరో 12 ఎయిర్‌పోర్టులలో ప్రైవేట్‌ పెట్టుబడుల వాటాను పెంచబోతున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రూ.13వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోనున్నట్టు తెలిపారు. (చదవండి : ప్యాకేజీ 4.0: నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యం)

రూ.1000కోట్లతో ఎఫిషియెంట్‌ ఎయిర్‌స్పేస్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు.  ‘భారత్‌లో 60 శాతం ఎయిర్‌ స్పేస్‌ మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన ఎయిర్‌ స్పేస్‌ వివిధ కారణలతో ప్రభుత్వ నియంత్రణలో ఉంది. దీని వల్ల విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. విమానాల ప్రయాణ కాలాన్ని తగ్గించుందకు ఎయిర్‌స్పేస్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ‌ఎంఆర్‌వో ట్యాక్స్‌ విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నట్టు తెలిపారు. విమానాల నిర్వహణలో డిఫెన్స్‌, సివిల్‌ ఏవియేషన్ల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. దీనివల్ల కంపెనీలకు సివిల్‌ ఏవియేషన్‌ నిర్వహణ భారం తగ్గనుందని నిర్మల తెలిపారు. ఎయిర్ పోర్టులతో పాటు.. అంతరిక్ష పరిశోధన రంగాల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులు అనుమతి కల్పిస్తున్నామన్నారు. అంతరిక్ష పరిశోధనలలో ఇస్రోతో పాటు ఇతర ప్రైవేటు రంగానికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

మరిన్ని వార్తలు