బుద్ధుని బోధనలను అనుసరిస్తున్నాం

8 May, 2020 02:28 IST|Sakshi
ఢిల్లీలో మాట్లాడుతున్న మోదీ

బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారతీయుల ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అవసరమైన వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. బుద్ధుని బోధనలను భారత్‌ త్రికరణ శుద్ధితో ఆచరిస్తుందన్నారు. అంతర్జాతీయ బుద్ధ పూర్ణిమ కార్యక్రమంలో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన పాల్గొన్నారు.

కరోనావైరస్‌ బాధితులు, ఆ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వీరులకు గౌరవ సూచకంగా ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘ఈ కష్టసమయంలో ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థంగా పని చేస్తున్న అందరు ప్రశంసలకు అర్హులు. భారతీయుల ప్రాణాలనే కాదు.. ప్రపంచ ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను కూడా అంతే నిబద్ధతతో భారతదేశంæ తీసుకుంది. భారత్‌లోను, విదేశాల్లోనూ కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి భారత్‌ బాసటగా నిలుస్తోంది’అన్నారు.  సాయం కోరిన ప్రతీ దేశాన్ని ఆదుకోవడానికి భారత్‌ ప్రయత్నించిందని తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం పని చేసే విధంగా మన లక్ష్యాలుండాలన్నారు.

‘బుద్ధ అనేది ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక పవిత్ర భావన.స్థల, కాల పరిస్థితులు మారినా ఆయన బోధనలు మనలో ప్రవహిస్తూనే ఉంటాయి’అని కొనియాడారు. భారత సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రార్థన కార్యక్రమంలో ప్రపంచంలోని దాదాపు       అన్ని బౌద్ధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లుంబిని వనం(నేపాల్‌), మహాబోధి ఆలయం(బోధి గయ, బిహార్‌), ముల్గంధ కుటి విహార(సారనాథ్, ఉత్తరప్రదేశ్‌), పరినిర్వాణ స్థూప(కుషినగర్, ఉత్తరప్రదేశ్‌), అనురాధపుర స్థూప(శ్రీలంక) తదితర పవిత్ర బౌద్ధ ప్రదేశాల్లో జరిగిన ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.  
 

మరిన్ని వార్తలు