అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

26 Jul, 2019 14:11 IST|Sakshi
అధికారి చిట్టిబాబు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్ : అప్పుడు రాత్రి 10 గంటలు.. తెల్లవారు జామున 5 గంటలకు దుబాయి నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రవాసి కార్మికుడి మృతదేహం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఆ మృతుడి కుటుంబ పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ ఆ రాత్రి 'ప్రవాసిమిత్ర' అధ్యక్షులు మంద భీంరెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అధికారి చిట్టిబాబుకు ఫోన్‌లో సమాచారం అందించారు. నిబంధనల కంటే మానవత్వం ముఖ్యమని భావించిన చిట్టిబాబు తక్షణమే స్పందించి ఆరాత్రి ప్రోటోకాల్ విభాగానికి ఫోన్ చేసి ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీచేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తెల్లవారుజామున చేరుకోగా ప్రోటోకాల్ అధికారి నర్సింగ్ పోలీసు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయించి మృతుల బంధువులకు శవపేటిక అప్పగించి అంబులెన్సులో పంపించారు. బాధిత కుటుంబానికి ఆపత్కాల సమయంలో అండగా నిలిచి తన వంతు సహాయం అందించిన అధికారి సేవలను పలువురు కొనియాడారు.

ఆపదలో ఆదుకునే హెల్ప్ లైన్లు
వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్‌లోని వారి బంధువులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090, హాట్ లైన్ నెంబర్ +91 11 4050 3090, తెలంగాణ  రాష్ట్రప్రభుత్వ ఎన్నారై విభాగం నెంబర్ +91 94408 54433 ఈ-మెయిల్: so_nri@telangana.gov.in కు సంప్రదించవచ్చు. హైదరాబాద్ లోని నాంపల్లి గృహకల్ప భవనంలోని పిఓఇ కార్యాలయ ఆవరణలోని 'క్షేత్రీయ ప్రవాసి సహాయతా కేంద్రం' (కేపీఎస్‌కే)ను స్వయంగా సందర్శించవచ్చు లేదా హెల్ప్ లైన్ నెంబర్ +91 73067 63482 ఈ-మెయిల్: helpline@owrc.in ద్వారా కూడా తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. 'ప్రవాసిమిత్ర' వాలంటీర్లు బిఎల్ సురేంద్రనాథ్, హైదరాబాద్ +91 79818 14226, స్వదేశ్ పరికిపండ్ల, కరీంనగర్ +91 94916 13129, సురేందర్ సింగ్ ఠాకూర్, కామారెడ్డి +91 93912 03187 లను కూడా సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు