ఎడారి దేశాలతో అనుబంధం

8 Nov, 2019 12:49 IST|Sakshi
గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చి గ్రామంలో స్థిరపడిన కొస్నూర్‌పల్లె గ్రామస్తులు

ముప్పై సంవత్సరాలుగా వలసబాట

వివిధ దేశాల్లో వంద మందికిపైగా ఉపాధి

కార్మికుల నుంచి ఉద్యోగుల వరకు..

గల్ఫ్‌పై కోస్నూరుపల్లె వాసుల ముద్ర

గల్ఫ్‌ దేశాలతో ఆ పల్లెవాసుల బంధం పెనవేసుకుంది. ఆ గ్రామంలో ముప్పైసంవత్సరాల క్రితం ఇద్దరితో ప్రారంభౖమైన వలసలు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వంద మందికిపైగా వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. కార్మికులుగాను,ఉద్యోగులుగాను ఉన్నారు. గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చిన వారుప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు.

కొరుట్ల శ్రీరాములు, ధర్మపురి:     జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కోస్నూరుపల్లె మారుమూల గ్రామం. ఈ గ్రామానికి అనుబంధంగా నాయికపుగూడెం, పెరుమండ్ల గూడెం, కోతులగూడేలున్నాయి. మొత్తం 300 కుటుంబాలు ఉండగా.. 1480 జనాభా ఉంది. కోస్నూరుపల్లె నుంచి మొదట 1989లో గల్ఫ్‌కు వలసలు ప్రారంభమయ్యాయి. చెరుకుపల్లె మల్లారెడ్డి, మూల మోహన్‌రెడ్డిలు మొదటగా దుబాయికి వెళ్లారు. ఇప్పుడు ఈ గ్రామానికి చెందిన దాదాపు 120 మంది గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. దుబాయి, మస్కట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ ప్రాంతాలకు మెరుగైన ఉపాధి కోసం వెళ్లా్లరు. అక్షరజ్ఞానం లేని వారు కూలీలుగాను, ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆయా దేశాల్లో ఉపాధి పొందుతున్న వారు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొందరు గల్ఫ్‌ నుంచి తిరిగి వచ్చి గ్రామంలోనే స్థిరపడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు.

గల్ఫ్‌కు వెళ్లి ఆర్థికంగా స్థిరపడ్డా
నేను 1991లో మా స్నేహితుడు తిరుపతిరెడ్డితో కలిసి దుబాయికి వెళ్లి ఐదు సంవత్సరాలు ఓ కంపెనీలో పనిచేసిన తర్వాత మస్కట్‌లో ఐదు సంవత్సరాలు, బహ్రెయిన్‌లో ఐదు సంవత్సరాలు ఉపాధి పొంది వచ్చాను. గల్ఫ్‌లో పొందిన సంపాదనతో ఆర్థికంగా స్థిరపడ్డా. రెండు ఎకరాల భూమి కొనుక్కున్నా. ఆరోగ్యం బాగాలేక గ్రామానికి తిరిగి వచ్చాను. ఇక్కడే వ్యవసాయం చేస్తున్న. గల్ఫ్‌ దేశాలతో మా కుటుం» ం బాగుపడింది.     – మూల మోహన్‌రెడ్డి

ఇరవై సంవత్సరాలుకు పైగా పనిచేశాను
1992 నుంచి 2013 వరకు వివిధ దేశాల్లో పనిచేసిన. యూఏఈ, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్‌ దేశాలకు వెళ్లాను. గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్‌కు గురైన. సంపాదించిన కొద్దిపాటి సొమ్ము వైద్యానికే ఖర్చయింది. కాలు, చేయి పనిచేయక వికలాంగుడినయ్యాను. పింఛన్‌ ఇస్త్తలేరు. నా తల్లి పింఛన్‌పై బతుకుతున్న.– మడుప రాజరెడ్డి

గ్రామానికి తిరిగి వచ్చి సర్పంచ్‌గా ఎన్నికయ్యాను
గల్ఫ్‌ దేశాల్లో పదిహేను సంవత్సరాలున్నా. ఎన్నో కష్టనష్టాలు అనుభవవించిన. 2007లో ఇంటికి చేరిన. వలస జీవనం వద్దని గ్రామంలోనే ఉంటూ నీటి సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన. తర్వాత గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యా. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సర్పంచ్‌గా పట్టం కట్టారు. ప్రజల సహకారంతో గ్రామాభివద్ధికి కృషిచేస్తున్నా.     – ఎన్నం లక్ష్మారెడ్డి

>
మరిన్ని వార్తలు