సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు నాయుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన మూతికి అట్లకాడ కాల్చి వాత పెట్టాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారని విమర్శించారు. పంచాయితీలు చేసి పైకి వచ్చారని, తన సహచరులు పార్టీని వీడుతుంటే సీఎం జగన్పై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ అభాసుపాలవుతున్నారని దుయ్యబట్టారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోవాలి
‘ఓటమిపాలైన వారు ప్రతిపక్షంలో ఉండటం..ప్రతిపక్షంలో ఉన్నవారు గెలిచి అధికారంలోకి రావడం సర్వసాధారణం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో అధికారపార్టీలను తిరిగి ఎన్నుకున్నారు. ఏపీలో మాత్రం టీడీపీని ఘోరంగా ఓడించి, కేవలం 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు మూలన కూర్చోబెట్టారు. తాను తప్పు చేశానన్న వాస్తవాన్ని గమనించలేక, ప్రజలు తప్పు చేశారని వింత దోరణితో మాట్లాడుతున్నారు. చాలా చోట్లకు వెళ్లి నన్ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. తాను పాలించే ఆవునని చెప్పుకుంటున్న చంద్రబాబు..ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోకపోతే టీడీపీకి అసలు మనుగడే ఉండదు. నాలుగు నెలల పాటు ఆయనకు పదవి లేకపోయే సరికి, తన పార్టీని వదిలి నాయకులు వదలిపెడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. క్షణం తీరిక లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
పదేళ్లు కష్టపడి అధికారంలోకి వచ్చారు
రాష్ట్రంలో పదేళ్లు కష్టపడి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు రౌడీ ముఖ్యమంత్రి, నేరస్తుడు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. వైఎస్ జగన్పై నేరారోపణలు చేయబడ్డాయి. అవి విచారణలో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని నేరస్తుడు అని ఎలా మాట్లాడుతున్నారు. బుద్ధి, జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలో ఉండి గట్టిగా అరిస్తే..మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడేవారట..నేనైతే ఎప్పుడు అలాంటి పరిస్థితి చూడలేదు. చంద్రబాబు ఎక్కడికెళ్తే అక్కడ పులివెందుల పంచాయితీ అంటున్నారు. వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడైనా పంచాయితీలు చేశారా? ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలతో ఐఏఎస్ ఆఫీసర్ను కూర్చోబెట్టి ఫిప్టీ ఫిప్టీ అని పంచిపెట్టింది ఎవరూ? విశాఖ ల్యాండ్ స్కామ్లో అయ్యాన్నపాత్రుడు, గంటాల మధ్య పంచాయితీ చేసింది నీవు కాదా? చింతమనేని ప్రభాకర్ పంచాయితీ చేసింది నీవు కాదా? ట్రాన్స్పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం విషయంలో పంచాయితీ చేసింది నీవు కాదా ?పంచాయితీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉంది. పులివెందుల పంచాయితీ కాదు..పౌరుషానికి నిదర్శనమైన ప్రాంతమది. ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాంతమది. పులివెందుల పంచాయితీ అంటే ఊరుకోకండి. అట్ల కర్ర కాల్చి చంద్రబాబు మూతిపై వాత పెట్టాలని కోరుతున్నా.
బాబు ఇంకా ఫ్రెస్టేషన్లో ఉన్నారు
కరకట్ట పంచాయితీ అంటున్నావు. ఆ ఇల్లు నీదా? వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత ఆ ఇల్లు నాది అంటున్నావు.. నీవు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం లింగమనేని గెస్ట్ హౌస్ అన్నావు. చంద్రబాబు ఇంకా ఫ్రెస్టేషన్లో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో నీవు ఎలా ప్రవర్తించావు. ఇవాళ మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఎంపీడీవో సరళమ్మ ఓ ఆరోపణ చేశారు. చింతమనేని -వనజాక్షి వ్యవహారంలో నీవు ఎలా వ్యవహరించావు? కోటంరెడ్డి- సరళమ్మ వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్ ఎలా వ్యవహరించారో గమనించాలి. అసెంబ్లీ నుంచి చైర్స్ ఎత్తుకెళ్తే కోడెల కుమారుడికి ఎందుకు బెయిల్ వచ్చింది? ఆరోపణ చేయబడిన వ్యక్తిని కస్టడిలోకి తీసుకోవడం, బెయిల్ ఇవ్వడం సర్వసాధారణం. సీఎం వైఎస్ జగన్ చట్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.