టీడీపీపై కక్షసాధించాల్సిన అవసరం లేదు : అంబటి

15 Jun, 2020 19:14 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీలాగానే టీడీపీ పరిస్థితి దిగజారింది: అంబటి 

సాక్షి, తాడేపల్లి : అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అవినీతిపై పోరులో తొలి అడుగే అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అరెస్టులు అని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌రెడ్డిలను అరెస్ట్‌ చేశారని స్పష్టం చేశారు. టీడీపీపై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలాగానే టీడీపీ పరిస్థితి దిగజారిందని విమర్శించారు.(చదవండి : ‘స్కీములను స్కాములుగా మార్చారు’)

చంద్రబాబు కుమారుడు కాబట్టి దొడ్డిదారిన కౌన్సిల్‌లోకి లోకేష్‌ను తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో లోకేష్‌ తుక్కు తుక్కుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. 151 సీట్లు గెలుచుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను దగ్గర్నుంచి కూడా చూసే పరిస్థితి లేదన్నారు. వడ్డీతో సహా చెల్లించడానికి ఇదేమన్నా హెరిటేజ్‌ సంస్థా అని ప్రశ్నించారు. లోకేష్‌ నాయకుడిగా తయారయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు.  జేసీ బ్రదర్స్‌ అక్రమాలు చంద్రబాబు, లోకేష్‌లకు కనిపించడం లేదా అని అంబటి ప్రశ్నించారు.  అక్రమ కట్టడంలో నివసిస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు.  ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అంబటి రాంబాబు విమర్శించారు.

మరిన్ని వార్తలు