అందరికీ తలా ఇంత

5 Nov, 2018 02:16 IST|Sakshi

అభ్యర్థుల ఖరారులో బీజేపీ సామాజిక కోణం

ప్రకటించిన స్థానాలు

ఓసీలకు31

బీసీలకు16

ఎస్సీలకు 9

ఎస్టీలకు 8

కేటాయించిన స్థానాల్లో మహిళలకు ఇచ్చినవి.. 9

మైనారిటీలకు కేటాయించినవి.. 2

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు కసరత్తు చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలుంటే ఇప్పటివరకు 66 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 53 స్థానాలకు అభ్యర్థులను ఈ నెల 12 నాటికి ప్రకటించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకు ప్రకటించిన 66 స్థానాల్లో ఓసీలకు 31 స్థానాలను కేటాయించింది.

అందులో 21 స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి, 7 స్థానాలను వెలమలకు కేటాయించింది. మరో రెండు స్థానాలను బ్రాహ్మణులకు, ఒక స్థానాన్ని వైశ్యులకు కేటాయించింది. 16 స్థానాలకు బీసీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎస్సీలకు 9, ఎస్టీలకు 8 స్థానాలను కేటాయించింది. మరో రెండు స్థానాలను మైనారిటీలకు కేటాయించింది. 66 స్థానాల్లో మహిళలకు 9 స్థానాలు ఖరారు చేసింది. త్వరలో ప్రకటించనున్న మిగతా 53 స్థానాల్లోనూ మరో 8 మంది మహిళలను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.  

ఆదిలాబాద్‌లో మిగిలింది రెండే..
రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు అభ్యర్థుల ఖరారును పూర్తి చేసింది. ఇంకా రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కరీంగనర్‌లోనూ 13 స్థానాలకు 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రక టించింది. హైదరాబాద్‌లో 15 స్థానాలుంటే 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంఐఎంపైనా పోటీకి దింపే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్లో 14 స్థానాలకు గాను 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది.

నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు ఉంటే కేవలం 4 స్థానాల్లోనే అభ్యర్థులను ఖరారు చేసింది. మెదక్‌లో ఇంకా 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. మొదటి, రెండో జాబితాలో పాత మెదక్‌ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాలుం టే అందులో 8 స్థానాలకు, నిజామాబాద్‌లో 9 స్థానాలు ఉంటే అందులో 4 స్థానాలకు అభ్యర్థు లను ఖరారు చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 స్థానాలు ఉంటే 5 స్థానాలకు, ఖమ్మంలో పది స్థానాలు ఉంటే 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. త్వరలోనే మిగితా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది.  

మరిన్ని వార్తలు