సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో అందరి కంటే సీనియర్ నాయకుడిని తానేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తాను 1995 లోనే సీఎం అయ్యానని, కానీ నరేంద్ర మోదీ 2002లో సీఎం అయ్యారని, అదృష్టం బాగుండి ప్రధాని అయ్యారని వ్యాఖ్యానించారు. అయినా మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు 19 బృందాలతో ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే.. మనం కోరిన వ్యక్తిని ప్రధానిని చేయొచ్చునని చెప్పారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్పకు హంద్రీ–నీవా ద్వారా నీరిచ్చే పనులకు శంకుస్థాపన చేసేందుకు బుధవారం ఆయన అనంతపురం జిల్లాకు వచ్చారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ఆయన అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా బీటీపీకి చేరుకున్నారు. అక్కడ పైలాన్ ఆవిష్కరించారు. రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం కళ్యాణదుర్గం చేరుకుని కాలువ పనులను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.