ఫ్లాప్‌ హీరో.. కొత్త డైరెక్టర్‌.. రూ.100 బడ్జెట్‌తో ‘యూవీ’ ప్రయోగం!

18 Nov, 2023 12:13 IST|Sakshi

సినిమా ఫలితం ఎలా ఉన్నా.. టాలీవుడ్‌ మార్కెట్‌లో అఖిల్‌ అక్కినేనికి ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఉంది. ఒక్క హిట్‌ పడితే చాలు..అఖిల్‌ స్టార్‌ హీరో అయిపోవడం ఖాయం. కానీ దురదృష్టవశాత్తు..అఖిల్‌ ఖాతాలో ఇప్పటి వరకు ఓ భారీ హిట్‌ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్‌’ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్‌ కూడా రాలేదు. అంతేకాదు.. ఓటీటీ స్ట్రీమింగ్‌ సైతం వివాదంలో చిక్కుకొని..ఇప్పటికీ రిలీజ్‌ కాలేదు. దీంతో అఖిల్‌ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏజెంట్‌ ఫలితాన్ని మర్చిపోయి..కొత్త సినిమాపై దృష్టిపెడుతున్నాడట. 

రూ. 100 కోట్లతో కొత్త సినిమా
ఏజెంట్‌ రిలీజై ఆరు నెలలు దాటినా..అఖిల్‌ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అఖిల్‌ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో అనిల్‌ కుమార్‌ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఫ్లాప్‌ హీరో, కొత్త డైరెక్టర్‌ అయినప్పటికీ..దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ప్రయోగం చేయబోతోంది యూవీ క్రియేషన్స్‌. ప్రస్తుతం అఖిల్‌కు టాలీవుడ్‌ మార్కెట్‌లో ఉన్న విలువ కంటే ఇది చాలా ఎక్కువ. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు భయపడడం లేదట. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

2025లో రిలీజ్‌?
అఖిల్‌ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నా సామిరంగ, బిగ్‌బాస్‌ 7 షోతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి కథ విని..ఫైనల్‌ వెర్షన్‌ని లాక్‌ చేస్తారట. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు