‘ఈశాన్య’ సంస్కృతి వాళ్లకో వింత

24 Nov, 2018 03:54 IST|Sakshi

ఇక్కడి వేషధారణని హేళన చేశారు

కాంగ్రెస్‌పై మోదీ ధ్వజం

ఐజ్వాల్‌/లుంగ్లీ: ఈశాన్య ప్రాంతమంటే కాంగ్రెస్‌కు ఏ మాత్రం గౌరవం లేదని, అక్కడి సంప్రదాయాలు, వస్త్రధారణను ఆ పార్టీ వింతగా చూడటం తనను బాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మిజోరంలోని లుంగ్లీలో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.  ఈశాన్య ప్రాంతంలో రవాణా మార్గాలను మెరుగుపరిచి మార్పు తీసుకురావాలన్నదే  తమ అభివృద్ధి మంత్రమని తెలిపారు.  లుంగ్లీలో ప్రచారం ముగిశాక రాజధాని ఐజ్వాల్‌లో మోదీ..ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలతో ముచ్చటించారు.

వారికి అధికారమే కావాలి..
కాంగ్రెస్‌ను వదిలించుకునేందుకు మిజోరంకు ఇదే చక్కటి అవకాశమని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ప్రధాన్యతాంశాల్లో ప్రజలు లేరని, అధికారం కోసమే వెంపర్లాడుతోందని మండిపడ్డారు. ‘మీ ఆశలు, ఆకాంక్షలంటే కాంగ్రెస్‌కు పట్టింపు లేదు. అధికారం దక్కించుకోవడమే వారికి ముఖ్యం. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే మిజోరం అభివృద్ధిలో కొత్త శిఖరాల్ని చేరుకుంటుంది. బీజేపీ హయాంలో ఈశాన్య ప్రాంతంలో రైల్వే మార్గాల విస్తరణ మూడింతలు పెరిగింది. క్రీడా నైపుణ్యానికి మిజోరం కేంద్ర బిందువు. ఇక్కడ పుట్టిన బిడ్డ ‘రోటి’ అనే పదం పలకడానికి ముందే బలంగా బంతిని తన్నడం నేర్చుకుంటాడుæ’ అని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు.

మరిన్ని వార్తలు