'ఆయనను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయండి'

19 Jan, 2020 18:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మంత్రి మల్లారెడ్డి మున్సిపల్‌ టికెట్ల కోసం కోట్లు వసూలు చేస్తున్నారని, టికెట్లు అమ్ముకోవడం అవినీతి అన్న విషయం తెలియదా అంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న శ్రవణ్‌ మాట్లాడుతూ.. ఏసిబి దీనిని సుమోటోగా ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. చిన్న ఉద్యోగులు లంచాలు తీసుకుంటే జైల్లో పెట్టే ఈ ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటున్న మల్లారెడ్డిపైఘే విధమైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శించారు. (కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు)

మల్లారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి వ్యవహారంపై పోలీసులతో పాటు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అవినీతీకి పాల్పడితే సొంత కొడుకైనా సరే జైల్లో పెడతా అని పలికిన కేసీఆర్‌కు మల్లారెడ్డి వ్యవహారం తెలియడం లేదా అని పేర్కొన్నారు. ఓట్లు ఎవరికి వేస్తున్నారో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఎలా తెలుస్తోంది.. వెంటనే ఎన్నికల కమీషన్‌ ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని దుయ్యబట్టారు.


 

మరిన్ని వార్తలు