సాక్షి, వికారాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. కోస్గి మండలం మీర్జాపూర్లోని ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున ఈ సోదాలు దాదాపు 45 నిమిషాలపాటు జరిగినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాల్లో నరేందర్ రెడ్డి నివాసంలో పెద్దమొత్తంలో నగదు దొరికినట్లు సమాచారం.
పట్నం నరేందర్ రెడ్డి నివాసంలో జరిగిన ఐటీ సోదాలపై ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ స్పందించారు. ఆయన నివాసంలో ఐటీ సోదాలు నిజమేనని, ఈ మేరకు సీల్డ్ కవర్ నివేదిక తమకు అందిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. గెలుపు కోసం రేవంత్రెడ్డి, నరేందర్ రెడ్డి హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.