కొండా దంపతుల దారెటు...?

8 Sep, 2018 03:59 IST|Sakshi

నేడు భవిష్యత్తుపై ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి కొండా సురేఖ అడుగులు ఎటు పడనున్నాయి?.. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా?.. వేరే దారి చూసుకుంటారా? ఇది టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ తాజా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే వీరి కూతురు సుష్మితా పటేల్‌కు భూపాలపల్లి లేదా పరకాల నియోజకవర్గాల్లో ఏదైనా ఒక టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కొండా దంపతులు కోరారు.

సుష్మితకు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.  సుష్మితకు టికెట్‌ ఇవ్వకపోగా కొండా సురేఖ పేరును కూడా జాబితాలో ప్రకటించలేదు. దీంతో వారు ఎలాంటి వైఖరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ తొలి జాబితా వెలువడిన తర్వాత ఏం చేయాలన్న దానిపై పూర్తిస్థాయిలో నిర్ణయించుకున్న తర్వాతే తమ వైఖరిని వెల్లడించాలని కొండా దంపతులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం కోసం కొండా సురేఖ పేరుతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ను రిజర్వ్‌ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు