టీడీపీ పునాది కూలిపోయింది

4 Nov, 2018 05:42 IST|Sakshi
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ సమాధిపై లేఖ ఉంచి నిరసన వ్యక్తం చేస్తున్న ఆయన సతీమణి లక్ష్మీపార్వతి తదితరులు

     ఎన్టీఆర్‌ సమాధి వద్ద లక్ష్మీపార్వతి ఆవేదన

     సమాధికి నాలుగు పేజీల లేఖ సమర్పణ

     తన పక్కన పెరుగుతున్న విషపు మొక్కను ఎన్టీఆర్‌ గుర్తించలేదు

     ఆయన మళ్లీ పుట్టి వెన్నుపోటుదారుల భరతం పట్టాలి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో చంద్రబాబు కలయికతో తన భర్త స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాది కూలిపోయిందని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తనతో తన భర్త ఎన్టీఆర్‌ చెప్పిన మాటలు నాలుగు పేజీల లేఖ ద్వారా హైదరాబాద్‌లోని ఆయన సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భౌతికంగా దూరమైనప్పటి నుంచి అనేక రకాలుగా బాధలు ఎదుర్కొంటూ, అవమానాలు భరిస్తూ తన భర్త ఎడబాటు మోస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌–టీడీపీ కలయికతో ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుందన్నారు. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి అఖండ విజయం సాధించారని చెప్పారు. తన భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఈ రోజు జరుగుతున్న పరిస్థితి చూసి కన్నీళ్ళు ఆపుకోలేక ఇక్కడకు వచ్చానన్నారు.

1989లో ఓడిపోయినప్పుడు కూడా ఎన్టీఆర్‌ పొత్తులకు వెళ్లలేదని, కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించిన మొనగాడిగా చరిత్రలో నిల్చిపోయారన్నారు. అవకాశవాద పొత్తులకు దూరంగా పార్టీని తీర్చిదిద్దారని, 1994లో మళ్లీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారని చెప్పారు. కానీ ఆయన పక్కనే పెరుగుతున్న విషపు మొక్కను గుర్తించలేక దాని పాలన పడి అధికారాన్ని, పార్టీని కోల్పోయి చివరకు వాళ్ల చేతులతో చెప్పులు కూడా వేయించుకొని అవమాన భారంతో కృంగి, కృశించి అందరికీ దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ చంద్రబాబు చేతిలో స్వార్థానికే అడుకునే బొమ్మలా మారిందని విమర్శించారు. చంద్రబాబు అవకాశవాద పొత్తులతో పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారని, బాబు చేతిలో పార్టీ పూర్తిగా పతనమై అవసాన దశకు చేరుకుందన్నారు.

చంద్రబాబు తప్పులు చేస్తున్నా ఎన్టీఆర్‌ అభిమానులంతా పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారని, ఏ సిద్ధాంతం మీద పార్టీని స్థాపించారో ఆ పునాది కూలిపోయిందన్నారు. ఏ ఆత్మగౌరవంతో ఢిల్లీ రాజకీయాల్ని వ్యతిరేకించారో అదే పార్టీకి చంద్రబాబు మోకరిల్లుతున్నారని చెప్పారు. ‘‘స్వామీ మీరు మళ్లీ పుట్టరా, మరలా విలువలతో కూడిన తెలుగువాడి పౌరుషాన్ని ప్రతిభింబించే పార్టీని స్థాపించి ఈ వెన్నుపోటు దారులను, అవినీతి చక్రవర్తులను, స్వార్థంకోసం నీతిని అమ్ముకునే నాయకులను దేశం నుంచి తరిమివేయడానికి మళ్లీ రావాలి’’ అని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. 

మరిన్ని వార్తలు