సుప్రీంకోర్టు ముందుకు ‘ముందస్తు ఎన్నికలు’

19 Sep, 2018 16:22 IST|Sakshi

తెలంగాణ ముందస్తు ఎన్నికలపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలైంది. గడువు కన్నా ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలంగాణలో 20 శాతం మంది ఓటు హక్కు కోల్పోతున్నారని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనను పిటిషనర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్‌ కోరారు. తెలంగాణలోని ఏడు ముంపు మండలాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిన పిటిషనర్‌..  ఆ మండలాల్లోని ఓటర్ల భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడు మండలాల్లో ఎలా పోలింగ్‌ నిర్వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు