కాంగ్రెస్‌ జాబితా.. టీజేఎస్‌, సీపీఐలో లొల్లి

13 Nov, 2018 12:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే అర్ధరాత్రి విడుదల చేసింది. కానీ ఈ జాబితానే మహాకూటమి మిత్రపక్షాలైన టీజేఎస్‌, సీపీఐలో చిచ్చుపెట్టింది. టీజేఎస్‌, సీపీఐలు ఆశించిన స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆయా పార్టీల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీల నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసమ్మతి జెండా ఎగురేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఆలేరు, ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, తాండూరు స్థానాలను ఇవ్వాలని తొలి నుంచి టీజేఎస్‌ పట్టుబడుతుండగా.. కొత్తగూడెం సీటును సీపీఐ ఆశిస్తోంది. అయితే, కొత్తగూడెం స్థానాన్ని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించిన కాంగ్రెస్‌... టీజేఎస్‌ అడిగిన స్థానాల్లోను అభ్యర్థులను ప్రకటించింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి సింగపూర్‌ ఇందిరను, ఆలేరు నుంచి బూడిద బిక్షమయ్యగౌడ్‌, ఆసిఫాబాద్‌లో అత్రం సక్కు, తాండూరు నుంచి పంజుగుల పైలట్‌ రోహిత్‌రెడ్డిల పేర్లను ఖారారు చేసింది.  దీనికితోడు తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తారని భావించిన ఒక్క నకిరేకల్‌ స్థానంలో కూడా కాంగ్రెస్‌ చిరుమర్తి లింగయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. 

దీంతో మిత్రపక్షాలు పునరాలోచనలో పడ్డాయి. మహాకూటమి ఒప్పందం ప్రకారం టీజెఎస్‌ 8, సీపీఐ 3, టీడీపీ 14, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక టికెట్‌ ఇస్తామన్నారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన మిత్రపక్షాలు.. తమకు అడిగిన చోట టికెట్లివ్వాలని విజ్ఞప్తి చేశాయి. కానీ కాంగ్రెస్‌ అవేవి పట్టించుకోకుండా ఆయా పార్టీలు అడిగిన చోటే అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న స్థానాల్లో టీజేఎస్‌కు టికెట్లు ఇచ్చారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీజేఎస్‌ అధినేత కోదండరాంకు ఇస్తానన్న జనగాం స్థానాన్ని కూడా పెండింగ్‌లో పెట్టడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో టీజేఎస్‌ పార్టీ నేతలు రెబల్స్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఆలేరు టీజేఎస్‌ నేత కల్లూరి రాంచంద్రారెడ్డి ఈ రోజు మధ్యాహ్నమే ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయనున్నారు. మరికొందరు నేతలు కూడా అదే దారిని ఎంచుకోనున్నారు. స్టేషన్‌ ఘనపూర్‌ టీజేఎస్‌ నేత చింత స్వామి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కూటమిలో ఒక్క టీడీపీ మినహా మిగతా పార్టీలన్నీ కాంగ్రెస్‌ జాబితాపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు