సంచలన ప్రకటన చేసిన టీఎంసీ ఎమ్మెల్యే

25 May, 2019 11:07 IST|Sakshi

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుభ్రాంగ్షు రాయ్‌ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌ కుమారుడు సుభ్రాంగ్షు రాయ్‌.. గర ఎన్నికల్లో టీఎంసీ తరఫున బిజ్పూర్‌ నుంచి గెలుపొందాడు. కానీ కొన్ని రోజుల క్రితం పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో.. ఆరేళ్ల పాటు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు సుభ్రాంగ్షు రాయ్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఎంసీలో చేరుతున్నప్పుడే మా నాన్న నన్ను జాగ్రత్తగా ఉండు. నీ మీద దాడి చేయవచ్చు.. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించవచ్చు అని హెచ్చరించారు. టీఎంసీలో ఉన్నన్ని రోజులు నాకు ఊపిరాడనట్లు అనిపించింది. పార్టీ నుంచి బయటకు వచ్చాక స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాను. త్వరలోనే కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాను. రెండు మూడు రోజుల్లో బీజేపీలో చేరతాను. టీఎంసీలో చాలా మంది నాయకులు నాలానే భావిస్తున్నారు’ అని తెలిపారు. సుభ్రాంగ్షు రాయ్‌ బిజ్పూర్‌ నుంచి రెండు సార్లు టీఎంసీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

మరిన్ని వార్తలు